పార్లమెంట్‌ సమావేశాలకు నోటిఫికేషన్

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్‌ 14 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ సమావేశాలు అక్టోబర్‌ 1తో ముగియనున్నాయి. కరోనా భయం వెంటాడుతున్న నేపథ్యంలో ఈ సమావేశాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉభయ సభల సభ్యులు కరోనా బారినపడకుండా అనేక ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఉదయం 4 గంటల పాటు లోక్‌సభ, సాయంత్రం 4గంటల పాటు రాజ్యసభ కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈసారి ప్రశ్నోత్తరాల సమయం ఎత్తివేసే అవకాశం ఉండటంతో శూన్యగంటతో ప్రారంభిస్తారని సమాచారం.

ఉభయ సభలూ ఒకేరోజు జరిగేలా ఏర్పాట్లు చేశారు. సభకు హాజరయ్యే ముందు ఎంపీలంతా విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఇప్పటికే కోరిన విషయం తెలిసిందే. ఉభయ సభల్లోనూ పలు చోట్ల ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా దృశ్యమాధ్యమం ద్వారా పర్యవేక్షించారు.