శిరోముండనం కేసులో నిందితుడు నూతన్ నాయుడు అరెస్ట్

శిరోముండనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నూతన్‌ కుమార్‌ నాయుడును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇప్పటికే నూతన్‌ నాయుడు భార్య ప్రియమాధురిని అరెస్ట్ చేయగా.. కేసు వెలుగుచూసినప్పటి నుంచి పరారీలో ఉన్న నూతన్‌ నాయుడిని ఉడిపిలో శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ చేసినట్లు సీపీ మనీష్ కుమార్ సిన్హా మీడియాకు వెల్లడించారు. ప్రియమాధురి సహా ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపామన్నారు. ఘటన జరిగిన రోజు 6 సెల్‌ఫోన్స్‌ సీజ్ చేశామని తెలిపారు. నూతన్ నాయుడు భార్య సమక్షంలోనే దళిత యువకుడికి శిరోముండనం జరిగిందని సీపీ వెల్లడించారు. సీసీ ఫుటేజీతో పాటు కీలక ఆధారాలు సేకరించామని వెల్లడించారు. శిరోముండనం ఘటనలో నూతన్‌నాయుడు ప్రమేయం ఉందని మరోసారి సీపీ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా నూతన్ నాయుడు ఇంట్లో పనిచేసి మానేసిన దళిత యువకుడికి అతడి భార్య మొబైల్ దొంగతనం చేశాడంటూ శిరోముండనం చేయించింది. దాంతో యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.