అమరావతి ఉద్యమంలో పాల్గొనాల్సిందే.. ఏపీ బీజేపీ నేతలకు అమిత్ షా కీలక ఆదేశాలు

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఏపీ బీజేపీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులు చేస్తున్న ఉద్యమంలో పాల్గొనాల్సిందేనని తేల్చి చెప్పారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు చేస్తున్న పోరాటానికి అనుకూలంగా బీజేపీ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. ఇప్పుడు దీనిపై మరో అభిప్రాయం ఎందుకని ప్రశ్నించారు. అలాగే, పొత్తులపైనా ఎవరూ నోరు మెదపొద్దని, ఈ విషయాన్ని అధిష్ఠానం తేలుస్తుందని స్పష్టం చేశారు.

ఏపీ పర్యటన చివరి రోజైన నిన్న రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహారావు, సీనియర్ నేతలు పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ తదితరులతో షా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమరావతి ఉద్యమంపై ఓ నాయకుడు మాట్లాడే ప్రయత్నం చేయగా షా తీవ్రంగా స్పందించారు.

అమరావతి కోసం రైతులు భూములిచ్చిన విషయం వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు. అలాగే, ఉద్యమం చేస్తున్నది కూడా రైతులే అయినప్పుడు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. ఒకసారి తీర్మానం చేశాక వెనక్కి తగ్గడం ఎందుకన్న కేంద్రమంత్రి.. పాదయాత్రలో పాల్గొనాల్సిందేనని నేతలను ఆదేశించారు. ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీనే ఎంతసేపూ విమర్శించడం సరికాదని, ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమించాలని, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు సొంతంగా కృషి చేయాలని అమిత్ షా దిశానిర్దేశం చేశారు.