శ్రీ రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలి: నాదెండ్ల మనోహర్

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ కె.రోశయ్య దివంగతులు కావడం విచారకరమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. పాలనాపరమైన అంశాలపై సాధికారత కలిగిన నేత ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రిగా అత్యధిక కాలం పని చేసిన శ్రీ రోశయ్యకి క్షేత్ర స్థాయిలో ప్రజల సాధకబాధకాల గురించి, వారి సంక్షేమానికి సంబంధించిన నిధుల వ్యయం గురించి ఎంతో అవగాహన ఉండేది. శ్రీ రోశయ్యతో నాకు వ్యక్తిగతంగా మంచి సాన్నిహిత్యం ఉండేది. తను పుట్టి పెరిగిన గుంటూరు జిల్లా అభివృద్ధి గురించి ఎంతో ఆలోచన చేసేవారు. ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో ఎదురైన క్లిష్ట పరిస్థితుల్లో తన రాజకీయ, పాలన అనుభవాన్ని చూపారు. తను తీసుకున్న ఏ బాధ్యతనైనా సమర్థంగా నిర్వర్తించారు. శ్రీ రోశయ్య కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని శ్రీ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.