పవన్ కళ్యాణ్ కు ప్రజలు అండగా నిలవాలి

  • సొంత నిధులతో ప్రజల్ని ఆదుకుంటున్న పవన్ కళ్యాణ్
  • ప్రస్తుత రాజకీయాల్లో దేశంలోనే ఇలాంటి నాయకుడిని చూడలేం
  • ఇప్పటం బాధితులకు లక్ష రూపాయలు ప్రకటించటం పై హర్షం వ్యక్తం చేసిన
    జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి.

అధికారంలో ఉన్న వైసీపీ వాళ్ళు తమ దాష్టీకాలతో ప్రజల్ని నష్టపరుస్తుంటే ఎలాంటి అధికారంలో లేని పవన్ కళ్యాణ్ మాత్రం సొంత కష్టార్జితంతో ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకుంటున్నాడని , ప్రస్తుత రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కనుచూపుమేరలో లేడని, అలాంటి నాయకుడికి ప్రజలు అండగా నిలవాలని జిల్లా జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. రోడ్డు వెడల్పు నెపంతో ఇప్పటం గ్రామంలోని రైతుల ఇళ్లను అధికారపార్టీ నేతలు కూల్చిన సంఘటన లో వారికి స్వయంగా అండగా నిలవటమే కాకుండా తన వంతు సాయంగా కూల్చిన ప్రతీ ఇంటికి పవన్ కళ్యాణ్ ఒక లక్ష రూపాయలు ప్రకటించటంపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఏ నాయకుడైన ప్రజల కష్టాల్ని తీర్చమంటే ముందు నాకు ఓటు వేయండి అప్పుడు నేను మీ సమస్యలు తీరుస్తాను అన్న నాయకుడే కానీ గెలుపోటములతో సంభందం లేకుండా దేశ చరిత్రలో తన సొంత నిధులతో ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. రాష్ట్రంలో ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఎలాంటి సమస్యలు ఎదురైనా జనసేన వైపు చూస్తున్నారన్నారు. ఉద్దానం లాంటి సమస్యలు, తాపీ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై పోరాడటంతో పాటూ వైసీపీ నేతలు చేస్తున్న అక్రమ మైనింగ్, ఇసుక, మట్టి వంటి సహజ వనరుల దోపిడీ, కబ్జాలు, అవినీతి, అరాచకాలను నిలువరించటంలోనూ జనసేన నిరంతరం పోరాడుతూనే ఉందన్నారు. అయితే ప్రజల్లో అధికార పార్టీపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత నెలకొన్నా తన దుర్మార్గాలను, ప్రజాధన దోపిడీని కొనసాగిస్తూనే ఉందన్నారు. ఎన్నికల్లో ఓట్లను డబ్బుతో కొనుక్కొని మరలా అధికారంలోకి వస్తాం అన్న ధీమాతోనే వైసీపీ దురాగతాలకు పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఓటును అమ్ముకుంటే తమ జీవితాలతో పాటూ తమ బిడ్డల భవిష్యత్ ను తాకట్టు పెట్టినట్లేనన్న ఆలోచన ప్రజల్లో కలగటం శుభపరిణామం అన్నారు. ప్రజా చైతన్యంతోనే వైసీపీ ప్రభుత్వానికి పతనం మొదలైందని, రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆళ్ళ హరి అన్నారు.