PM Modi: ప్రతి జిల్లాకు ఓ మెడికల్‌ కాలేజీ లక్ష్యంగా..!

కరోనా స‌మ‌యంలో నేర్చుకున్న పాఠాల‌ను దృష్టిలో పెట్టుకొని వైద్య‌రంగానికి పెద్ద పీఠ వేసేదిశ‌గా కేంద్రం అడుగులు వేస్తున్న‌ది.  ఆరోగ్య‌రంగాన్ని బ‌లోపేతం చేసేందుకు ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటోంది.  ఆరోగ్య రంగాన్ని బ‌లోపేతం చేయ‌డంతో పాటుగా స్వ‌యం స‌మృద్ది సాధించేందుకు కృషి చేస్తున్నామ‌ని ప్ర‌ధాని మోడి పేర్కొన్నారు.  ఇందులో భాగంగానే దేశంలోని ప్ర‌తి జిల్లాలో ఒక మెడిక‌ల్ కాలేజీ లేదా పీజీ వైద్య విద్యాకేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు ప్ర‌ధాని మోడి పేర్కొన్నారు.  ఈరోజు రాజ‌స్థాన్‌లోని నాలుగు జిల్లాల్లో మెడిక‌ల్ కాలేజీల‌కు ప్ర‌ధాని శంకుస్థాప‌న చేశారు.  2014 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌స్థాన్‌లో మొత్తం 23 మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింద‌ని ప్ర‌ధాని మోడీ పేర్కొన్నారు.  2014 వ‌ర‌కు దేశ వ్యాప్తంగా మెడిక‌ల్ పీజీ కాలేజీల్లో 80 వేల సీట్లు ఉండ‌గా, ఇప్పుడు ఆ సంఖ్య 1.40 ల‌క్ష‌ల‌కు చేరింద‌ని అన్నారు.  దేశంలోని 6 ఏయిమ్స్ నుంచి 22 ఏయిమ్స్ వ‌ర‌కు పెరుగుతున్నాయ‌ని, అదే విధంగా, గ‌డిచిన 6-7 ఏళ్ల కాలంలో దేశంలో కొత్త‌గా 170 మెడిక‌ల్ కాలేజీలను ఏర్పాటు చేసిన‌ట్టు ప్ర‌ధాని పేర్కొన్నారు.