పిల్లలపై కొవాగ్జిన్ టీకా ట్రయల్స్‌కు సన్నాహాలు.. నేడు ఎయిమ్స్‌లో బాల వలంటీర్ల ఎంపిక

దేశీయ తయారీ కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ పిల్లలపై ట్రయల్స్‌కు రెడీ అవుతోంది. ఇప్పటి వరకు 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తుండగా, ఎయిమ్స్‌లో 12-18 ఏళ్ల మధ్య వారికి ఇప్పటికే ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు 6 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులపై ట్రయల్స్‌కు సమాయత్తం అవుతున్నారు. ఇందులో భాగంగా నేడు బాల వలంటీర్ల ఎంపిక ప్రారంభం కానున్నట్టు ఎయిమ్స్‌కు చెందిన సెంటర్ ఫర్ కమ్యూనికేట్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్ తెలిపారు. కాగా, త్వరలోనే 2 నుంచి ఆరేళ్లలోపు చిన్నారులపైనా త్వరలోనే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి.

మరోవైపు, 2 నుంచి 18 ఏళ్ల వయసు వారిపై కొవాగ్జిన్ క్లినికల్ పరీక్షలకు భారత్ బయోటెక్‌కు అనుమతి ఇస్తూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఏ) గత నెల 12న ఆదేశాలు జారీ చేసింది. చిన్నారులను మూడు గ్రూపులుగా విభజించి టీకా పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా కండరానికి టీకా ఇస్తారు. రెండు డోసుల మధ్య 28 రోజుల వ్యవధిని పాటిస్తారు.