జాతిపిత గాంధీకి అమెరికా ప్రతిష్ఠాత్మక ‘కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్’

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ.. జాతిపిత మహాత్మా గాంధీని ప్రతిష్ఠాత్మక ‘కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్’ పురస్కారంతో గౌరవించుకోవాలని అమెరికా ప్రతినిధులు సభ తీర్మానించింది. న్యూయార్క్​ ప్రజాప్రతినిధి కరోలిన్ బీ మెలోని ఈ ప్రతిపాదనను సభ ముందు ఉంచగా సభ్యులు ఆమోదం తెలిపారు. శాంతి, అహింస మార్గాల్లో మానవాళికి ప్రేరణగా నిలిచిన గాంధీకి ఈ పురస్కారాన్ని ఇవ్వాలని చట్టసభ్యురాలు కరోలిన్ బీ మెలోని కోరారు.

మహాత్మా గాంధీ చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమం, ఆయన నడిచిన అహింస మార్గాలు దేశానికి, ప్రపంచానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయని కరోలిన్ బీ మెలోని పేర్కొన్నారు. ఇతరులకు సేవ చేయడం కోసం సర్వస్వాన్ని ఇచ్చేయడం అనే దానికి ఆయనో ఉదాహరణ అని చెప్పారు. గాంధీ మార్గం.. మార్టిన్​ లూథర్​ కింగ్ జూనియర్, నెల్సన్​ మండేలా చేపట్టిన వర్ణవివక్ష వ్యతిరేక ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. ఓ ప్రజాప్రతినిధిగా గాంధీ నుంచి చాలా విషయాలు నేర్చుకుంటున్నట్లు కరోలిన్ బీ మెలోని పేర్కొన్నారు.