ప్రభుత్వ ఆధీనంలో ప్రైవేట్ ఆస్పత్రులు

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు వీలుగా మరింత వైద్య సేవలు అందించేందుకు హర్యానాలోని ప్రైవేట్ ఆస్పత్రులు ఇకపై ప్రభుత్వ ఆజమాయిషీలో పనిచేయనున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ కొన్ని రోజులుగా వస్తున్న డిమాండ్లపై ప్రభుత్వం చర్చించి ఈ నిర్ణయం తీసుకుంది. హర్యానా సీఎం మనోహర్ లాల్, హర్యానా హోం, ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ బుధవారం సుదీర్ఘంగా చర్చించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా మహహ్మరిని సమర్ధంగా కట్టడి చేసేందుకు ప్రతి జిల్లాకు నియమితులైన నోడల్ అధికారులు ప్రైవేట్ ఆసుపత్రులపై నిఘా ఉంచాలని ఆదేశించారు. అన్ని రకాల ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించాలని సూచనలు ఇచ్చారు. పలు ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువగా చికిత్స పొందుతున్న రోగుల నుంచి ప్రైవేట్ ఆస్పత్రులు వసూలు చేయడాన్ని నిరోధించేందుకే ఇలా ప్రైవేట్ హాస్పిటళ్లపై ఆజమాయిషీ పెట్టి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని నిర్ణయించారని తెలుస్తోంది.