బటన్లు నొక్కుతూ పేదల్ని విస్మరిస్తున్నారు

• ప్రమాద బీమా కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది
• జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

బటన్లు నొక్కుతున్నాం.. డబ్బు ఇస్తున్నామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల్ని పూర్తిగా విస్మరించిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. ప్రమాదంలో వ్యక్తి చనిపోతే కనీస ఆర్థిక సాయం అందించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. బాధ్యతగల రాజకీయ పార్టీగా మా కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే రూ. 5 లక్షల బీమాను ఇస్తుంటే… ప్రభుత్వం ప్రమాద బీమా రూ. 2 లక్షలు కూడా ఎగ్గొట్టాలని చూస్తోందన్నారు. శ్రీ జగన్ రెడ్డి చేస్తున్న లక్షల కోట్ల అప్పులు ఎవరి కోసమని నిలదీశారు. ఆదివారం మధ్యాహ్నం ఉమ్మడి ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గం పరిధిలోని తోట వెంగన్నపాలెంకు చెందిన క్రియాశీలక సభ్యుడు చెల్లు మోహనరావు కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. శ్రీ మోహనరావు కుటుంబానికి నాదెండ్ల మనోహర్ ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున రూ. 5 లక్షల బీమా చెక్కును అతని భార్య శ్రీమతి ధనలక్ష్మికి అందచేశారు. పార్టీ తరఫున ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శ్రీ మోహనరావు పిల్లల చదువుల బాధ్యతలు చూడాలని పార్టీ జిల్లా నాయకులకు సూచించారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ.. బాధ్యతగా బాధలో ఉన్న కుటుంబానికి భరోసా కల్పించాలన్న లక్ష్యంతోనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకువచ్చినట్టు తెలిపారు.
• జనసేన జెండా ఆవిష్కరణ
అనంతరం వెంగన్నపాలెం గ్రామంలో స్థానిక పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన జనసేన జెండా స్థూపాన్ని ప్రారంభించి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ తాళ్లూరు మండలాధ్యక్షుడు శ్రీ తూటాల ప్రసాద్ గ్రామ సమస్యలను శ్రీ మనోహర్ గారి దృష్టికి తీసుకువచ్చారు. తాగునీటి వ్యవస్థ నిర్వహణ లేక మూలనపడడంతో వెంగన్నపాలెం గ్రామస్తులు తాగునీటి కోసం రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుందని, గోతులతో రోడ్డు చిద్రంగా మారితే జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరమ్మతులు చేసిన విషయాన్ని శ్రీ మనోహర్ గారికి తెలిపారు. అంతకు ముందు దర్శి నియోజకవర్గంలో అడుగు పెట్టిన శ్రీ మనోహర్ గారికి చీమకుర్తి, సోమవరప్పాడు, తూర్పు గంగవరం తదితర గ్రామాల్లో ఘన స్వాగతం పలికారు. బాణాసంచా పేలుళ్లు, సంప్రదాయ వాద్యాలతో ఆహ్వానం పలికారు. దారి పొడుగునా పూల వర్షం కురిపించారు. సోమవరప్పాడు గ్రామంలో వెలసిన గంటి గంగాభవాని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, దర్శి ఇంఛార్జ్ బొటుకు రమేష్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, అధికార ప్రతినిధులు డాక్టర్ గౌతమ్, శ్రీమతి రాయపాటి అరుణ, పార్టీ నేతలు మలగా రమేష్, బెల్లంకొండ సాయిబాబు, వరికూటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.