శ్రీలంకకు వెళ్లే టీమ్ కు కోచ్ గా రాహుల్ ద్రావిడ్

శ్రీలంక పర్యటనకు వెళ్లే శిఖర్ ధావన్ నేతృత్వంలోని టీమిండియాకు రాహుల్ ద్రావిడ్ కోచ్ గా వ్యవహరిస్తాడని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ప్రకటించింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షాలు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. జులైలో శ్రీలంకతో జరగనున్న పరమిత ఓవర్ల మ్యాచ్ లకు ఇటీవలే టీమ్ ను కూడా బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

ఆ టీమ్ కు ద్రావిడ్ కోచ్ గా ఉంటారని ఎన్నెన్నో ఊహాగానాలు వినిపించాయి. వాటన్నింటినీ నిర్ధారిస్తూ రాహుల్ ద్రావిడ్ కోచ్ గా వ్యవహరిస్తాడని ఓ వార్తా సంస్థతో గంగూలీ వ్యాఖ్యానించాడు. టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, విక్రమ్ రాథోడ్ లు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టెస్ట్ టీమ్ కు కోచ్ లుగా వ్యవహరిస్తుండడం వల్ల శ్రీలంకతో తలపడే టీమ్ కు రాహుల్ ద్రావిడ్ కోచ్ గా ఉంటాడని జై షా ప్రకటించాడు. సోమవారం నుంచి వారం పాటు జట్టు సభ్యులను కఠినమైన క్వారంటైన్ లో ఉంచినట్టు చెప్పాడు.

జులై 13 నుంచి శ్రీలంకతో జరిగే మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం ఈ నెల 28న టీమిండియా ఆటగాళ్లు కొలంబో వెళ్లనున్నారు. అక్కడ జులై 4 వరకు మరోమారు క్వారంటైన్ కానున్నారు. ఆ తర్వాత ఆటగాళ్లంతా రెండు వేర్వేరు జట్లుగా ఏర్పడి ప్రాక్టీసు మ్యాచ్ లు ఆడుతారు. జులై 13, 16, 18న వన్డే మ్యాచ్ లు, 21, 23, 25వ తేదీల్లో టీ20 మ్యాచ్ లు జరుగనున్నాయి.