రఫేల్‌ యుద్ధ విమానాల ఎంట్రీ

రఫేల్ యుద్ధ విమానాలను మొహరించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు ఉదయం 10గంటలకు భారత వైమానిక దళంలో రాఫెల్ యుద్ధ విమానాలు లాంఛనంగా చేరబోతున్నాయి. హర్యానాలోని అంబాలలో ఉన్న వైమానిక స్థావరంలో రఫేల్ యుద్ధ విమానాలను మొహరించడం ద్వారా ఆ యుద్ధ విమానాలను జాతికి అంకితం చేయనున్నారు. అంబాలలోని గోల్డెన్ ఆరోస్ 17 స్క్వాడ్రాన్‌లో భాగంగా ఈ రఫేల్ యుద్ధ విమానాలు సేవలు అందించనున్నాయి. ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్‌ ఏవియేషన్స్‌ నుంచి మొదటి దశలో ఐదు అత్యాధునిక యుద్ధ విమానాలు జూలై 27న అంబాలాకు చేరిన విషయం తెలిసిందే. కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లీ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ స్టాఫ్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్‌ భదౌరియా, రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, రక్షణ శాఖ ఆర్‌అండ్‌డీ కార్యదర్శి, డీఆర్‌డీఓ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి, రక్షణ మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్ననున్నారు.

అంబాలలో రఫేల్‌ విమానం ఆవిష్కరణకు సంప్రదాయ పూజలు నిర్వహించనున్నారు. అలాగే రఫేల్‌, తేజస్‌ విమానాల ఎయిర్‌ డిస్‌ప్లే, అనంతరం రఫేల్‌ యుద్ధ విమానాలకు వాటర్‌ సెల్యూట్‌తో కార్యక్రమం ముగుస్తుంది. కార్యక్రమానంతరం భారత, ఫ్రెంచ్‌ ప్రతినిధి బృందం ద్వైపాక్షిక సమావేశం జరుగనుంది.