వైద్య రంగానికి అండగా ఆర్బీఐ..
దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండటంతో వైద్య రంగాన్ని బలోపేతం చేయడం కోసం ఆర్బీఐ రంగంలోకి దిగింది. కొవిడ్ సంబంధిత వైద్యవిభాగాలకు నిధులను అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంతదాస్ వెల్లడించారు. ఇందుకోసం రూ.50 వేలకోట్ల మేరకు ఆన్ట్యాప్ నిధులను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించారు. వీటికి మూడేళ్ల కాల వ్యవధి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. ”భారత్ కొవిడ్ను సమర్థంగా ఎదుర్కొంటుందన్న నమ్మకం ఉంది. ఈ సారి రుతుపవనాలు కూడా సానుకూలంగా ఉంటాయనే అంచనాలతో గ్రామాల్లో డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నాం. కొవిడ్ నిబంధనలు, ఆంక్షల్లో.. పలు సంస్థలు వ్యాపారాలను కాపాడుకొనే శక్తిని తెచ్చుకొన్నాయి. కొవిడ్ వైద్య సదుపాయాల పెంపునకు ఆర్బీఐ రూ.50వేల కోట్ల నిధులను బ్యాంకులకు అందుబాటులోకి తెచ్చింది” అని పేర్కొన్నారు. ఈ నిధులను బ్యాంకులు వ్యాక్సిన్ తయారీ సంస్థలకు, ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగు పర్చేందుకు రుణాలుగా ఇవ్వొచ్చు. ఈ రుణాలకు ప్రాధాన్యం కూడా ఇవ్వొచ్చు. బ్యాంకులు ఈ పథకం కింద కొవిడ్ లోన్ బుక్ ఏర్పాటు చేయవచ్చు.
ఇక చిన్న ఫైనాన్స్ సంస్థల కోసం రూ.10వేల కోట్ల దీర్ఘకాల రుణాలను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. గతంలో రుణాల రీస్ట్రక్చర్ను వాడుకొన్నవారు మరో రెండేళ్లపాటు మారటోరియం పొందే అవకాశం ఇచ్చారు. భారత్ వద్ద 588 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యం ఉండటంతో సంక్షోభాలను ఎదుర్కొనే శక్తి లభిస్తుందన్నారు. రూ.25 కోట్ల వరకు రుణాలు తీసుకొన్న వ్యక్తులు రీస్ట్రక్చర్ చేసుకోవడానికి రెండో అవకాశం ఇచ్చింది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్బీఐ ఇచ్చే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్య నిబంధనలు సరళతరం చేసింది. దీంతో గతంలో 36 రోజుల వరకు ఉండే గడువు.. ఇప్పుడు 50 రోజులకు పెంచింది.