దుబాయ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న ప్రయాణికులకు ఊరట

దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌లో బుధవారం మధ్యాహ్నం 300 మందికి పైగా ప్రయాణీకులు చిక్కుకుపోగా, వారందరికీ దేశంలోకి ప్రవేశం కల్పిస్తూ అధికారులు గురువారం ప్రకటించారు. దీంతో ఈ 300 మంది వారి ఇళ్లకు చేరారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ ఎఫైర్స్, ఎయిర్‌పోర్ట్ పాస్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్, రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ అధికారులు ఓ బృందంగా ఏర్పడి, చిక్కుకుపోయిన ప్రయాణికులను వారి ఇళ్లకు పంపించే ఏర్పాట్లు చేశారు. కాగా, పాలసీ అప్‌డేట్ కారణంగా ప్రయాణికులు డీఎక్స్‌బీ అరైవల్ టెర్మినల్స్ వద్ద చిక్కుకున్నారు. కొత్త పాలసీ ప్రకారం డీఎక్స్‌బీ వద్దకు వచ్చే ప్రయాణికులు ఇతర ఎమిరేట్స్‌లో జారీ చేసిన నివాస వీసాలు కలిగి ఉండాలి. అలాగే ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్(ఐసీఏ) నుండి ప్రీ-ట్రావెల్ ఆమోదం కూడా తప్పనిసరి.

దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాలో ప్రెస్, ఇన్ఫర్మేషన్ అండ్ కల్చర్ కాన్సుల్ నీరజ్ అగర్వాల్ మాట్లాడుతూ… సుమారు 290 మంది ఫ్లైదుబాయ్ భారత ప్రయాణికులను బుధవారం రాత్రి వారి ఇళ్లకు చేర్చినట్లు పేర్కొన్నారు. ఫ్లైదుబాయ్ ఏర్పాటు చేసిన ఏడు బస్సుల్లో ఇండియన్ ప్రయాణికులను దుబాయ్ నుంచి అబుధాబి, అల్ ఐన్‌కు తరలించామని ఆయన తెలిపారు.