న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించండి.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ.!
నూతన సంవత్సర ప్రారంభోత్సవాన్ని గొప్పగా.. పార్టీగా జరుపుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నవారందరికీ కేంద్రం షాకిచ్చింది. దేశంలో ‘స్ట్రెయిన్’ వైరస్ కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యం లో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. న్యూఇయర్ వేడుకలపై పలు నిబంధనలు విధించాలంటూ రాష్ట్రాలకు లేఖ రాసింది. కరోనా వైరస్ వ్యాప్తి, ‘స్ట్రెయిన్’ కలవరం నేపధ్యంలో డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో జరగనున్న వేడుకలపై నిఘా ఉంచడమే కాకుండా ఆంక్షలు కూడా విధించాలని సూచించింది. అయితే తుది నిర్ణయాన్ని మాత్రం రాష్ట్రాలకే వదిలేసింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతున్న నేపధ్యంలో న్యూఇయర్ వేడుకలపై కఠినమైన నిఘా ఉంచడంతో పాటు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ కేంద్ర ఉన్నతాధికారి ఒకరు రాష్ట్రాలకు లేఖ రాశారు. అయితే అంతర్రాష్ట్ర ప్రయాణాలపై మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేశారు.
కాగా, దేశంలో 20 ‘స్ట్రెయిన్’ కేసులు బయటపడటంతో.. వైరస్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే జనవరి 7 వరకు యూకే విమానాలపై నిషేధం విధించిన కేంద్రం.. డిసెంబర్ 9 నుంచి 22 మధ్య విదేశీ ప్రయాణీకులను గుర్తించి పరీక్షించేందుకు చర్యలు తీసుకుంటోంది.