రూ. 210 కోట్ల నష్ట పరిహారం ఇప్పించాలి.. అశ్వనీదత్

సినీ నిర్మాత అశ్వనీదత్ విజయవాడలోని గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన తనకు నష్టపరిహారం చెల్లించేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అమరావతి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అశ్వనీదత్ తరపున న్యాయవాది జంధ్యాల రవిశంకర్ మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఆ కాంట్రాక్టు నుంచి ప్రస్తుత ప్రభుత్వం వైదొలగడంతో తనకు భారీ నష్టం వాటిల్లిందని తన పిటిషన్ లో అశ్వనీదత్ పేర్కొన్నారు. అశ్వనీదత్ తరపు లాయర్ జంధ్యాల రవిశంకర్ హైకోర్టులో వాదనలు వినిపించారు.

అశ్వనీదత్ కు ఏడాదిగా ప్రభుత్వం లీజును కూడా చెల్లించలేదని రవిశంకర్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ వైఖరితో అశ్వనీదత్ ఎంతో నష్టపోయారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఫైనల్ కౌంటర్లను దాఖలు చేయాలని రెవెన్యూ, మున్సిపల్, సీఆర్డీయేలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 3కి వాయిదా వేసింది. గత ప్రభుత్వ హయాంలో సుమారు 40 ఎకరాల భూమిని విమానాశ్రయ విస్తరణ కోసం అశ్వనీదత్ ఇచ్చారు. దీనికి బదులుగా అమరావతిలో ఆయనకు ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అమరావతి నుంచి రాజధానిని మార్చాలనుకోవడంతో తనకు తీరని నష్టం వాటిల్లిందని. ప్రభుత్వం నుంచి రూ. 210 కోట్ల పరిహారాన్ని వెంటనే ఇప్పించాలని హైకోర్టును అశ్వనీదత్ ఆశ్రయించారు.

ఫైనల్ కౌంటర్లు దాఖలు చేయాలని రెవెన్యూ, మున్సిపల్, సీఆర్డీఏ కి హైకోర్టు ఆదేశించగా.. తదుపరి విచారణ నవంబర్ 3 కి వాయిదాపడింది.