సంక్రాంతి జోష్‌కు హైకోర్టు బ్రేక్

సంక్రాంతి పండుగ సందర్భంగా వైభవంగా జరిగే కోడి పందాలకు ఏపీ హైకోర్టు బ్రేకులు వేసింది. పందాలు వేద్దామని, బెంటింగ్ లు కాద్దామని ప్రయత్నాలు మొదలు పెట్టిన వారికి హైకోర్టు షాకిచ్చింది. పండుగకు వారం రోజుల ముందు నుంచే ఆంధ్రాలో హడావుడి మొదలవుతుంది. ఈ పండుగ వచ్చిందంటే చాలు అల్లుళ్లు.. చుట్టాలంతా ఒక దగ్గర చేరిపోతుంటారు. ఎంతో సంబురంగా ఎంజాయ్‌ చేస్తారు. అయితే.. ఈ పండుగకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏపీలో సంక్రాంతి జోష్‌కు బ్రేక్‌ వేసింది.

సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది కోడి పందేలు. వీటిని ఏపీలోని ప్రతి గ్రామంలోనూ నిర్వహిస్తుంటారు. జోరుగా పందేలు కాస్తుంటారు. అయితే.. తాజాగా ఈ కోడిపందేలకు సిద్ధమవుతున్న వారికి హైకోర్టు షాకిచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు బెట్టింగ్‌లు నిలువరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆ జిల్లా పెదపూడికి చెందిన షేక్ సలీం హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. 2016లోనే తాము కోడిపందేలు జరగకుండా చూడాలని హైకోర్టు ఆదేశాల్లో గుర్తు చేసింది.

సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలో కోడి పందేలు జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు ఖచ్చితంగా అమలు చేయాలని తాజాగా ఏపీ హైకోర్టు అధికారులకు ఆదేశాలిచ్చింది. కోర్టు ఉత్తర్వులను అధికారులు పాటించలేదని గతంలో దాఖలైన కోర్టు ధిక్కరణ కేసుతో కలిపి పిటిషన్‌ను విచారిస్తామని తెలిపింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.