జనసేన ఎదుగుదలను చూస్తే వైఎస్సార్ పార్టీ వెన్నులో వణుకు పుడుతుంది

  • విమర్శించిన రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎదుగుదలను చూస్తే అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల వెన్నులో వణుకు పుడుతుందని జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.. సెప్టెంబర్ 10వ తేదీన జరిగిన తన పుట్టినరోజు వేడుకల సందర్భంగాను, వారాహి యాత్ర విజయవంతం అయిందని తమ కార్యాలయం వద్ద, ఏలూరు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, క్యాలెండర్లు ఏర్పాటు చేశామన్నారు.. తన పుట్టినరోజు వేడుకలకు వేలాదిగా ప్రజలు తరలి రావడంతో ఈర్ష్యతో అధికార పార్టీ ఎమ్మెల్యే, మేయర్ కలసి అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, క్యాలెండర్లు తొలగించారన్నారు. ట్రాఫిక్ కు అంతరాయంగా ఉన్న ప్రాంతాల్లో తొలగిస్తే తమకు అభ్యంతరం లేదని, అయితే ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం లేకపోయినా సందుల్లో, ఖాళీగా ప్రాంతాల్లోనూ, తమ సొంత స్థలాల్లో ఉన్న ఫ్లెక్సీలను సైతం తొలగించడం దుర్మార్గ చర్య అన్నారు. వైసీపీకి సంబంధించిన వారి ఫ్లెక్సీలు మాత్రమే ఉండాలని, ఇతర పార్టీలకు సంబంధించినవి ఉండకూడదని ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారా అని నిలదీశారు. వైసీపీ వారివి కూడా తొలగించి నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాలని అధికారులకు రెడ్డి అప్పలనాయుడు సూచించారు.. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఫ్లెక్సీలు పెడితే తమకేమీ అభ్యంతరం లేదన్నారు. ఏలూరు నగరం ఎవరి యొక్క సొంత సొత్తు కాదన్నారు.. హోర్డింగులు ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, ఫ్లెక్సీలు, హోర్డింగ్లకు ఏ విధంగా టెండర్ లు పిలిచారు, ఎంత వసూలు చేస్తున్నారు, ఎన్ని హోల్డింగ్ లు ఉన్నాయి, వ్యాపారస్తులు గాని, వాణిజ్య సంస్థలు గాని, రాజకీయ నాయకులు కడుతున్న ఫ్లెక్సీలకు గాని ఎంతమంది కార్పొరేషన్ కు డబ్బు కడుతున్నారో చెప్పాలని అధికారులను రెడ్డి అప్పలనాయుడు ప్రశ్నించారు. ఏలూరు నగరం మొత్తం వైసీపీ మినహా మరెవ్వరివీ ఉండకూడదు అన్నట్లుగా కుట్రపూరితమైన ఆలోచనతో ఎమ్మెల్యే ఈర్షతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. జనసేన పార్టీకి అపూర్వ ఆదరణ పెరిగి ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రజలు కూడా జనసేన పార్టీ వైపు చూస్తున్నారన్న ఉక్రోసంతో తాము కట్టిన ఫ్లెక్సీలు, క్యాలెండర్లు తొలగించారన్నారు. అధికార పార్టీ నాయకులు చేస్తున్న దోపిడీకి జనసేన పార్టీ అడ్డొస్తుందని వారికి భయం పట్టుకుందన్నారు. ఏలూరు నగరపాలక సంస్థలో కోట్లాది రూపాయలు లూటీ జరిగిందని, దాన్ని జనసేన పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారన్నారు. దీన్ని తట్టుకోలేక, ఓర్వలేక, జనసేన పార్టీ ఎదుగుదలను చూసి ఎమ్మెల్యే ఆళ్ళ నాని, మేయర్, మేయర్ భర్త కుట్ర పూరిత ఆలోచనలతో అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి తమ ఫ్లెక్సీలను, క్యాలెండర్లను సొంత స్థలంలో ఏర్పాటు చేసినటువంటివి కూడా తొలగించారన్నారు. ఈ విషయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని గుర్తు పెట్టుకోవాలని వైసీపీ ప్రజాప్రతినిధులకు రెడ్డి అప్పలనాయుడు హితవు పలికారు.