వరల్డ్ నంబర్ వన్ చేతిలో సింధు ఓటమి
సుదీర్ఘ విరామం తర్వాత బ్యాడ్మింటన్ కోర్టులోకి అడుగుపెట్టిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆశించినమేర రాణించలేకపోతోంది. థాయ్లాండ్ ఓపెన్ సూపర్-1000తో తొలి అంతర్జాతీయ టోర్నీలో పోటీపడ్డ ప్రపంచ చాంపియన్ సింధు తొలి రౌండ్లోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఓపెన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లింది. ఎన్నో అంచనాలతో బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్లో బరిలోకి దిగిన ఆరోసీడ్ సింధు ఆరంభ రౌండ్లోనే ఓటమిపాలైంది.
మహిళల సింగిల్స్ గ్రూప్-బిలో సింధుకు తొలి రౌండ్లోనే ఎదురుదెబ్బ తగిలింది. మెరుగైన ప్రదర్శనే చేసిన సింధు 21-19, 12-21, 17-21తో వరల్డ్ నంబర్ వన్ తై జు యింగ్(చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. 59 నిమిషాల పాటు జరిగిన పోరులో తొలి గేమ్ను కైవసం చేసుకున్న సింధు తర్వాతి రెండు గేమ్ల్లో ప్రత్యర్థి ధాటికి నిలువలేకపోయింది.
ఇప్పటి వరకు తై జు యింగ్తో 21సార్లు తలపడిన సింధు 16సార్లు ఓడిపోయింది. గ్రూప్-బిలో సింధు తన తర్వాతి మ్యాచ్లో స్థానిక క్రీడాకారిణి ఇంతానన్ రచనోక్(థాయ్లాండ్)తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇటీవలి థాయ్లాండ్ టోర్నోలో సింధును రచనోక్ చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.