చిరంజీవిని ఇబ్బంది పెట్టిన సోనూసూద్‌.. ఇక పై విలన్‌ పాత్రలు చేయను

తెలుగు  చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించిన సోనూసూద్‌.. రియల్‌ లైఫ్‌లో మాత్రం ఎంతోమందికి తన వంతు సాయం అందించి ప్రజల హృదయాల్లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సోనూ ప్రతినాయకుడి లక్షణాలు ఉన్న పాత్రలో కనిపించనున్నారు.

లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని నెలలపాటు వాయిదా పడిన ‘ఆచార్య’ చిత్రీకరణ కొన్నిరోజుల క్రితం తిరిగి పట్టాలెక్కిన విషయం తెలిసిందే. తాజా షెడ్యూల్‌లో భాగంగా సోనూసూద్‌-చిరంజీవిలపై ఇటీవల కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. అయితే, చిత్రీకరణ సమయంలో సోనూని కొట్టడానికి చిరు ఎంతో ఇబ్బందిపడ్డారట. ఈ విషయాన్ని తాజాగా సోనూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాకుండా తాను విలన్‌ పాత్రలు పోషించనని చెప్పారు.

‘ఇప్పుడు నాకు హీరో పాత్రలకు అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే నాలుగు అద్భుతమైన స్ర్కిప్ట్‌లు నా వద్దకు వచ్చాయి. విలన్‌ పాత్రలు చేయను. కాబట్టి కొత్త ఆరంభానికి స్వాగతం పలుకుదాం. ఇటీవల నేను ‘ఆచార్య’ షూట్‌లో పాల్గొన్నాను. చిరు సర్‌కి నాకూ మధ్య యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరించారు. షూట్‌ సమయంలో చిరు సర్‌ నా వద్దకు వచ్చి.. ‘ఎంతోమందికి సేవలు అందించి ప్రజల హృదయాల్లో మంచి స్థానాన్ని సొంతం చేసుకున్నావు. యాక్షన్‌ సీన్స్‌లో నిన్ను కొట్టాలంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తోంది. ఒకవేళ నేను నిన్ను కొడితే ప్రజలు నాపై కోపంగా ఉంటారు’ అని అన్నారు. అంతేకాకుండా ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో చిరు నాపై కాలు పెట్టాల్సి ఉంటుంది. దాన్ని కూడా మేము రీషూట్ చేశాం’ అని సోనూసూద్ వెల్లడించారు.