తెలంగాణ హైకోర్టు సీరియస్.. ప్రభుత్వం చెప్పకపోతే మేమే ఆదేశాలిస్తాం

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ ఈరోజుతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితులపై ఈరోజు విచారణ జరిగింది. నైట్ కర్ఫ్యూ ముగుస్తున్న తరుణంలో తదుపరి తీసుకోబోయే చర్యలపై నిన్న హైకోర్టు విచారణ జరిపింది. అయితే వివరాలను రేపు ఇస్తామని కోర్టుకు నిన్న ఏజీ తెలిపారు. దీంతో, విచారణను హైకోర్టు ఈరోజుకు వాయిదా వేసింది. అయితే, తదుపరి కార్యాచరణపై ఈరోజు ఎలాంటి వివరాలను అంజేయకపోవడంతో… హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించింది. 24 గంటల్లో ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయిందని నిలదీసింది. రేపటి నుంచి ఎలాంటి చర్యలు తీసుకోబోతోందని ప్రశ్నించింది.

హైకోర్టు ప్రశ్నకు బదులుగా రేపు ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉందని ఏజీ తెలిపారు. ఈ అంశంపై చీఫ్ సెక్రటరీ సమీక్షను నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని చెప్పేందుకు 45 నిమిషాల సమయాన్ని ఇస్తున్నామని తెలిపింది. తాము ఇచ్చిన సమయంలోగా ప్రభుత్వం నిర్ణయాన్ని తెలుపకపోతే.. తామే ఆదేశాలను జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూని మరో వారం రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.