కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న బిట్ కాయిన్ల వ్యవహారం
కర్ణాటకలో ఇటీవల బయటపడిన రూ.9 కోట్ల విలువగల బిట్ కాయిన్ల వ్యవహారం అక్కడి రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ వ్యవహారంతో భాజపా నేతలకు సంబంధం ఉన్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
తాజాగా మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి మరిన్ని సంచలన ఆరోపణలు చేశారు. బిట్ కాయిన్ స్కామ్ నిందితుడు జన్ధన్ ఖాతాలను హ్యాక్ చేసి రూ.6వేల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. ఈవిషయం ప్రధాని మోదీకి కూడా తెలిసుండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
కర్ణాటకకు చెందిన హ్యాకర్ శ్రీకృష్ణ అలియాస్ శ్రీకి నుంచి ఇటీవల రూ.9కోట్ల విలువైన బిట్ కాయిన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంతో అధికార పార్టీకి చెందిన కొందరు కీలక నేతలకు ప్రమేయం ఉన్నట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. హ్యాకర్ శ్రీకృష్ణ గతంలో ప్రభుత్వ వెబ్సైట్లను హ్యాకింగ్ చేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. క్రిప్టో కరెన్సీ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు కూడా అతడిపై ఆరోపణలున్నాయి.