ఏలూరు పట్టణంలో మొదలైన మార్పు

• వారాహి విజయ యాత్రకు బ్రహ్మరథం
• ప్రతి అడుగులో శ్రీ పవన్ కళ్యాణ్ కి అపూర్వ స్వాగతం
• గజమాలలు.. ఆడపడుచుల హారతుల మధ్య భారీ రోడ్ షో
• ఏలూరులో మలి విడత వారాహి విజయ యాత్ర

ఏలూరులో మార్పు మొదలయ్యింది. నగరం మొత్తం జనసేనాని వెంట కదలి వచ్చిందా అనిపించింది. ప్రతి అడుగులో ప్రజలు బ్రహ్మరథం పట్టగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మలి విడత వారాహి విజయ యాత్ర ఘనంగా ప్రారంభమయ్యింది. గజమాలల ఘనస్వాగతాలు.. ప్రతి అడుగులో ఆడపడుచుల హారతులు.. జన సైనికుల జయజయధ్వానాలు.. ప్రతి అడుగు పలుకరించిన స్వాగత తోరణాలు.. అన్నింటికీ మించి ఉప్పెనగా మారి ఏలూరు పుర వీధుల్ని ముంచెత్తిన జన వాహిని. వారాహి విజయ యాత్ర సభ సందర్భంగా ఏలూరు పట్టణంలో నిర్వహించిన రోడ్ షో ఆధ్యంతం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి లభించిన అపూర్వ స్వాగతం వర్ణణాతీతం. ఆరు కిలోమీటర్లు.. రెండున్నర గంటలపాటు సాగిన ర్యాలీ ప్రతి అడుగు ప్రజల హర్షాతిరేకాల మధ్య సాగింది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మిని బైపాస్ రోడ్డులోని క్రాంతి ఫంక్షన్ హాల్ నుంచి బయలుదేరిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రోడ్డు ఎక్కగానే ఓ భారీ జనప్రవాహం జేజేలు కొడుతూ స్వాగతం పలికింది. ఓ భారీ గజమాల ఆయనను అలంకరించగా ముందుకు కదిలారు.
• ఏలూరు మొత్తం జన సంద్రం
మిని బైపాస్, గ్రీన్ సిటీ, సత్రంపాడు, సీఆర్ రెడ్డి కళాశాల, కొత్త బస్టాండ్, ఫైర్ స్టేషన్ మీదుగా సాగిన ర్యాలీ ఆధ్యంతం కిక్కిరిసిన జనసందోహం మధ్యనే సాగింది. ఏలూరు పట్టణంలో ఇళ్లలో జనం మొత్తం వారాహి యాత్రకు వచ్చేశారా అన్న చందంగా రహదారులు మొత్తం జనప్రవాహాన్ని తలపించాయి. ఆడపడుచులు ప్రతి అడుగులో హారతులు పట్టగా.. మరికొంత మంది పుష్పగుచ్చాలు అందించేందుకు పోటీ పడ్డారు. వారాహి విజయ యాత్ర బహిరంగ సభా స్థలికి రెండు కిలోమీటర్ల ముందు నుంచి ప్రతి అడుగుకీ జనప్రవాహం రెట్టింపు అవుతూ వచ్చింది. ఏలూరుతో పాటు చుట్టు పక్కల నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వారాహి విజయ యాత్రకు కదలిరావడంతో రహదారులు జనంతో కిక్కిరిసిపోయాయి. ప్రజలు, ముఖ్యంగా మహిళలంతా రహదారికి ఇరువైపులా బారులుతీరి శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై పూల వర్షం కురిపించారు. రెల్లి సోదరులు వారాహి విజయ యాత్రకు వస్తున్న జనసేనానికి స్వాగతం పలుకుతూ వేసిన పోస్టర్ తో జనం మధ్య కలియ తిరుగగా, ఆ పోస్టర్ ను శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేతిలోకి తీసుకుని రెల్లి సోదరులను సంతోషపరిచారు. స్టార్ హీరోల ఫోటోలతో ఆయా హీరోల అభిమానులు దుష్టపాలకులపై మనమంతా కలసి పోరాడుదాం అంటూ ప్రదర్శించిన ప్లకార్డులు ఆకట్టుకున్నాయి.
• ఆలోచింప చేసిన జనసేన పోస్టర్లు
వారాహి విజయ యాత్ర సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతూ ఏలూరు పట్టణంలో ఏర్పాటు చేసిన బ్యానర్లు, హోర్డింగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామనే విషయాలు తెలియపరుస్తూ ఏలూరు పట్టణం మొత్తం భారీ హోర్డింగులు వెలిశాయి. జనసేన ప్రభుత్వంలో విద్య, వైద్యం ఉచితం… రైతులు, యువత, మహిళలతో పాటు వివిధ వర్గాల ప్రజలకు ఏం చేస్తామనే అంశాలు తెలియపరుస్తూ నగరం మొత్తం స్థానిక నేతలు ఏర్పాటు చేసిన పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. ఏలూరు పట్టణంలో ప్రతి కూడలిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు ప్రయత్నించారు. కొంత మంది పోస్టర్ల రూపంలోనే సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఏలూరు ప్రజానీకంలో వచ్చిన మార్పుకి సంకేతంగా ప్రతి పోస్టర్ లో మార్పు మొదలయ్యింది అన్న పదాన్ని చేర్చారు.. హల్లో ఆంధ్ర.. బైబై వైసీపీ నినాదాలు కూడా మిన్నంటాయి.
• పొత్తిళ్లలో చిన్నారిని చేతుల్లోకి తీసుకుని…
క్రాంతి ఫంక్షన్ హాల్ వెలుపల ఓ తల్లి తన నెలల శిశువుతో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చూసేందుకు వచ్చింది. కారు మీద నిలబడి తన పొత్తిళ్లలో బిడ్డను జనసేనాని చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నించగా ఆయన ఆ శిశువును చేతుల్లోకి తీసుకుని ముద్దాడారు. ఏలూరులో మొదలైన మలివిడత వారాహి విజయ యాత్ర ఘనమైన అడుగుతో ప్రారంభం కాగా.., ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కొటికలపూడి గోవిందరావు, రెడ్డి అప్పల నాయుడు, బొమ్మిడి నాయకర్, కళ్యాణం శివ శ్రీనివాస్, శ్రీమతి ఘంటసాల వెంకట లక్ష్మి, కరాటం సాయి, మల్నీడి తిరుమల రావు, చెన్నమల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.