సుమీత్ రికార్డు విజయంతో దేశం గర్వపడుతోంది: ప్రధాని మోదీ

టోక్యో పారాలింపిక్స్ జావెలిన్ త్రో అంశంలో భారత అథ్లెట్ సుమీత్ ఆంటిల్ వరల్డ్ రికార్డు నెలకొల్పి పసిడి పతకం చేజిక్కించుకోవడంతో భారత క్రీడాభిమానులు ఉప్పొంగిపోతున్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, సుమీత్ ఆంటిల్ కు అభినందనలు తెలిపారు. సుమీత్ రికార్డు విజయంతో దేశం గర్వపడుతోందని తెలిపారు. సుమీత్ భవిష్యత్తులోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. టోక్యో పారాలింపిక్స్ లో భారత అథ్లెట్ల మెరుపులు కొనసాగుతున్నాయని కొనియాడారు.

ఇవాళ జరిగిన ఎఫ్64 జావెలిన్ త్రో ఫైనల్ ఈవెంట్ లో సుమీత్ పసిడి పతకం గెలిచే క్రమంలో మూడుసార్లు వరల్డ్ రికార్డు నెలకొల్పడం విశేషం. దాంతో సుమీత్ పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.