మహారాష్ట్రలో ఘోర విషాదం.. కుప్పకూలిన భవనం.. 8 మంది మృతి

మహారాష్ట్రలోని థానే జిల్లా భీవండిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజూమున మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. భవన శిధిలాల కింద పలువురు చిక్కుక్కుపోయారు. చిన్నారులు సహా ఇప్పటివరకూ 25 మందిని రక్షించిన సహాయ బృందాలు.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని థానే మున్సిపల్ కార్పొరేషన్ పిఆర్వో వెల్లడించారు. 30 ఏళ్ల కిందట నిర్మాణం జరిగిన ఈ భవనం ఎల్ ఆకారంలో ఉండేది. ‘జిలానీ బిల్డింగ్’ పేరిట ఉన్న ఈ భవనానికి ఇప్పటికే రెండుసార్లు మహానగర్ పాలిక నోటీసులు ఇచ్చింది. ఈ ప్రమాదంలో భవనం పూర్తిగా కూలిపోయింది. థానేకు చెందిన ఫైర్ బ్రిగేడ్, టీడీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నాయి. గాయపడిన వారిని ఐజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.