24 రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వీహెచ్

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ వి.హనుమంతరావు 24 రోజుల తర్వాత నిన్న డిశ్చార్జ్ అయ్యారు. టీపీసీసీ‌ అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత రేవంత్‌రెడ్డి ఇటీవల ఆసుపత్రిలో వీహెచ్‌ను కలిసి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన రేవంత్‌రెడ్డి.. వీహెచ్ నుంచి విలువైన సలహాలు, సూచనలు స్వీకరించారు. కాగా, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం వీహెచ్ మాట్లాడుతూ.. తాను త్వరగా కోలుకోవాలని, తన ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ పూజలు చేసిన అభిమానులు, నాయకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.