శంషాబాద్‌లో రూ. 21 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత.. జాంబియా మహిళ అరెస్ట్

శంషాబాద్ విమానాశ్రయంలో నిన్న భారీగా హెరాయిన్ పట్టుబడింది. ఖతర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో జాంబియా నుంచి వచ్చిన మహిళ నుంచి 21 కోట్ల రూపాయల విలువైన 3.2 కిలోల హెరాయిన్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు జాంబియా నుంచి జొహన్నెస్‌బర్గ్, దోహా మీదుగా శంషాబాద్ చేరుకుంది. ఆమె రహస్యంగా మాదకద్రవ్యాలను తీసుకొస్తున్నట్టు పక్కా సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు ఆమె బ్యాగేజీని తనిఖీ చేయగా అందులో పొడి రూపంలో ఉన్న హెరాయిన్ లభ్యమైంది. దానిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని తెరవెనుక ఉన్న వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.