బిజెపిలోకి విజయశాంతి

బీజేపీలో చేరేందుకు రాములమ్మకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న విజయశాంతి బీజేపీ గూటికి చేరబోతున్నారని ప్రచారం సాగుతుంది. కాంగ్రెస్ ప్రచార కమిటీ సారథిగా ఉన్న విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూనే అధికార టీఆర్ఎస్ పై విమర్శలు కొనసాగిస్తున్నారు.

తాజాగా సోమవారం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, విజయశాంతిని హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ ఇద్దరు మాట్లాడుకోగా.. దీంతో విజయశాంతి పార్టీ మార్పు దాదాపు ఖాయం అయినట్లు సమాచారం.

1998లో బీజేపీలో చేరడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని విజయశాంతి ప్రారంభించారు. అంతేకాదు బీజేపీ విమెన్స్‌ వింగ్‌ (భారతీయ మహిళా మోర్చా) సెక్రటరీగా కూడా పనిచేశారు. అయితే ఆ తరువాత బీజేపీ నుంచి బయటకు వచ్చిన విజయశాంతి.. 2009లో తల్లి తెలంగాణ అని సొంత పార్టీని స్థాపించారు. తరువాత దాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ తరఫున 2009 ఎన్నికల్లో ఎంపీగా కూడా విజయం సాధించారు. ఆ తరువాత టీఆర్‌ఎస్‌లో విబేధాలు రావడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి.. 2014లో కాంగ్రెస్‌లో చేరారు. ఈ క్రమంలో 2014 ఎన్నికల్లో మెదక్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. అయితే గత కొన్ని నెలలుగా విజయశాంతి కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు.

గతంలో బీజేపీలో యాక్టివ్ గా ఉన్న విజయశాంతికి పార్టీ అగ్రనేతలతో సత్సంబంధాలున్నాయి. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ఉద్యమంలో ముందున్నారు. పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసి. 2009లో మెదక్ నుండి టీఆర్ఎస్ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత టీఆర్ఎస్ కు దూరమై కాంగ్రెస్ గూటికి చేరారు.