రూ.4100 కోట్లు ఇస్తేనే ఎవర్ గివెన్ నౌకను అప్పగిస్తాం: ఈజిప్టు డిమాండ్

సూయజ్ కాలువలో అడ్డంపడి ప్రపంచ వాణిజ్యానికి తీవ్ర నష్టం కలిగించిన ఎవర్ గివెన్ నౌకను అప్పగించేందుకు ఈజిప్ట్ ససేమిరా అంటోంది. రూ. 4100 కోట్లు (55 కోట్ల డాలర్లు) ఇస్తే అప్పుడు చూద్దామని కరాఖండీగా చెబుతోంది. అయితే, తాను అంత మొత్తం చెల్లించలేనని, 15 కోట్ల డాలర్లు మాత్రం ఇవ్వగలనని నౌక యజమాని షోయ్ కిసే‌న్ కౌషా పేర్కొన్నారు.

సూయజ్ కాలువలో అడ్డంపడిన నౌకను కదిలించి, రవాణాను పునరుద్ధరించేందుకు 600 మందికిపైగా కార్మికులు కష్టపడ్డారని, ఈ క్రమంలో ఒకరు ప్రాణాలు కూడా కోల్పోయారని ఈజిప్టు ప్రభుత్వం గుర్తు చేసింది. కాబట్టి 55 కోట్ల డాలర్లు అడగడంలో ఏమాత్రం తప్పులేదని పేర్కొంది. మరోవైపు, నష్టపరిహారం చెల్లించేంత వరకు దానిని ఈజిప్టులోనే ఉంచాలని కోర్టు ఇప్పటికే ఆదేశించింది.