రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడ?

•మాటలు తప్ప చేతలు లేని చేతగాని ప్రభుత్వమిది
•వరుసగా మహిళలపై అఘాయిత్యాలు చోటు చేసుకొంటున్నా సిబిఐ దత్తపుత్రుడిలో చలనం లేదు
•పోలీసులను రాజకీయ అవసరాలకు వాడుకుంటూ శాంతిభద్రతలను గాలి కొదిలేయడం సిగ్గుచేటు

దిశ చట్టం చేశాం… గన్ కంటే జగన్ ముందు వస్తాడు… లాంటి మాటలు చెప్పడం తప్ప వైసీపీ పాలకులు యువతులకు, మహిళలకు ఇసుమంతైనా రక్షణ ఇవ్వలేకపోతున్నారని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వైసీపీ పాలనలో మాటలు తప్ప చేతలు లేకపోవడం వల్లే ఈ అఘాయిత్యాలు చోటు చేసుకొంటున్నాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలం, తుమ్మపూడి గ్రామంలో వివాహితపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టి హత్య చేసిన ఘటన బాధాకరం. కొల్లూరు మండలం చిలమూరులోనూ పట్టపగలే ఓ మహిళ హత్యకు గురవ్వడం దురదృష్టకరం. విజయవాడలో మానసిక పరిపక్వత లేని యువతిపై సర్వజనాసుపత్రిలో చోటు చేసుకున్న ఘటన, తిరువూరులో ఇంటర్ విద్యార్థినిపై వాలంటీర్ భర్త వేధింపులాంటివి మరువక ముందే గుంటూరు జిల్లాలో అత్యాచారాలు, హత్యలు జరిగాయి. వరుసగా మహిళలపై అత్యాచారాలు, వేధింపులు జరుగుతున్నా సిబిఐ దత్తపుత్రుడిలో చలనం లేదు. మహిళల రక్షణ విషయంలో పాలకులకు చిత్తశుద్ధి లోపించడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది.. ఇలాంటి దారుణాలకు ఒడిగట్టేవారికి భయం అనేది లేకుండాపోయింది. చట్టాలు చేశాం, యాప్ తెచ్చాం అని ప్రకటనలు మాత్రమే చేసే చేతగాని ప్రభుత్వం వల్ల ఆడబిడ్డలకు ధైర్యం కలగడం లేదు. ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలో కృష్ణా నది ఒడ్డున గతేడాది జులైలో సామూహిక అత్యాచారం చోటు చేసుకొంటే ఇప్పటికీ ఓ నిందితుణ్ణి పట్టుకోలేదు. గుంటూరు జిల్లా మేడికొండూరులోనూ సామూహిక అత్యాచారం జరిగితే పోలీసుల స్పందన, నిందితులను అదుపులోకి తీసుకోవడంలో జాప్యం చూస్తే – వ్యవస్థను ఈ పాలకులు ఎలా గాడి తప్పించారో అర్థం అవుతోంది. వైసీపీ ప్రభుత్వం పోలీసు శాఖను తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటూ శాంతిభద్రతలు గాలికొదిలేసింది. వైసీపీ ఫ్లెక్సీలు చిరిగితే స్కూలు పిల్లలను పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టే స్థితికి ఆ శాఖను దిగజార్చింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి అని చెప్పుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం? ఆడబిడ్డలకు రక్షణ కల్పించి… అఘాయిత్యాలకు పాల్పడేవారిపై కఠిన శిక్షలు పడేలా కేసులు నమోదు చేసినప్పుడు ఆ అవార్డులకు విలువ ఉంటుంది అని అన్నారు.