వైసిపి పార్టీ నుంచి భారీ చేరికలు

తాడేపల్లిగూడెం, గ్రామపంచాయతీలో నిధులను దారి మళ్లించి గ్రామాల అభివృద్ధిని ముఖ్యమంత్రి జగన్ నిర్వీర్యం చేశారని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి పార్టీల అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి వైయస్ఆర్సీపీ నుంచి పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామ వైసీపీ నాయకుడు మజ్జి అప్పారావు తన అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయన నివాసం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో బొలిశెట్టి మాట్లాడుతూ త్రాగునీరు, రోడ్లు సైతం వేయలేని స్థితిలో ఈ ఐదేళ్ల పరిపాలన కొనసాగిందని దీనికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జనసేన పార్టీలోకి వచ్చిన ప్రతి కార్యకర్త కష్టాల్లోనూ నేను ఉంటానని భరోసా ఇచ్చారు. జనసేన కుటుంబం జగమంత కుటుంబంగా మారిందని తాడేపల్లిగూడెంలో వైసీపీ ఖాళీ అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తోట గోపి, పైబోయిన రఘు, పైబోయిన వెంకటరామయ్య, వర్తనపల్లి కాశి, పుల్ల బాబి, జగత సోమశేఖర్, వీర్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.