కొనవూపిరితో కొట్టుమిట్టాడుతున్న వైసీపీ

  • ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించిన పార్టీ శ్రేణులు
  • ముఖ్యమంత్రి బేల మాటలతో నిరాశా నిస్పృహల్లో వైసీపీ కార్యకర్తలు
  • ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ నుంచే వైసీపీ పతనం ప్రారంభమైంది
  • వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాకారానికి సమయం ఆసన్నమైంది
  • జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనలో అన్ని వర్గాల ప్రజలు నరకయాతన అనుభవించారని, ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోయిన వైసీపీ ఓటమి అంచుల్లో కొనవూపిరితో కొట్టుమిట్టాడుతోందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందే వైసీపీ నేతలు ఓటమిని అంగీకరిస్తున్నారన్నారు. ఇష్టం వచ్చిన రీతిలో అధికారులను మారుస్తున్నారని ఈ నేపధ్యంలో ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం తనకు లేదంటూ స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడటం ఓటమి భయాన్ని సూచిస్తుందన్నారు. జగన్ రెడ్డి బేలతనంతో పార్టీ శ్రేణుల్లో నిరాశానిస్పృహలు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే వైకాపా నేతలు కాడి వదిలేయటంతో కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజల్ని, ప్రతిపక్ష నేతల్ని హీంసించి పైశాచిక ఆనందం పొందారని విమర్శించారు. తమ అడుగులకు మడుగులొత్తుతూ తాము ఎన్ని దుర్మార్గాలు, దాష్టీకాలు చేసినా పట్టించుకోని అధికారుల్ని బదిలీ చేస్తే జగన్ రెడ్డి గుండెలు బాదుకోవటం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి జగన్ అరాచకాల్లో మొదటి బాద్యులైన ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ నుంచే వైకాపా పతనం ప్రారంభమైందంటూ జోస్యం చెప్పారు. తమకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటిని కూడా రాకుండా చేయటమే కాకుండా విధి నిర్వహణలో నరకం చూపించిన జగన్ రెడ్డికి ఉద్యోగులు తమ ఓటుతో రాజకీయ ఘోరీ కడుతున్నారని వ్యాఖ్యానించారు. కొన్నేళ్లుగా ప్రజలు కోరుకుంటున్న వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాకారానికి సమయం ఆసన్నమైందని, రాష్ట్రానికి మంచిరోజులు రానున్నాయని ఆళ్ళ హరి అన్నారు.