పురూహుతికా అమ్మవారిని దర్శించుకున్న రామ్ చరణ్

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలిపేందుకు శనివారం పిఠాపురం వచ్చిన మెగా పవర్ స్టార్ శ్రీ రామ్ చరణ్ గారు శ్రీ పాదగయ క్షేత్రాన్ని సందర్శించారు. తల్లి శ్రీమతి సురేఖ గారు, ప్రముఖ నిర్మాత శ్రీ అల్లు అరవింద్ గారితో కలసి శక్తి పీఠం పురూహుతికా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని అర్చించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు శ్రీ చక్ర దర్శనం చేయించి వేద ఆశీర్వచనాలు అందించారు. శ్రీ రామ్ చరణ్ గారి రాక తెలుసుకుని పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిటకిటలాడింది. ఆలయం వెలుపల వేలాది మంది అభిమానులు శ్రీ రామ్ చరణ్ గారికి జేజేలు పలికారు. వాహనం నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. అక్కడి నుంచి చేబ్రోలులోని శ్రీ పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. అంతకు ముందు శ్రీమతి సురేఖ గారు, శ్రీ అల్లు అరవింద్ గారు దత్తాత్రేయ అవతారం శ్రీ పాద శ్రీ వల్లభుని దర్శించుకున్నారు.