సాగర్‌ ఉపఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేసిన టీఆర్ఎస్

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో తమ అభ్యర్థి పేరును టీఆర్ఎస్ ఖరారు చేసింది. దివంగత నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ కు టికెట్ ఇచ్చింది. కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ భగత్ కు బీఫామ్ అందజేయనున్నారు. రేపు ఉదయం ఆయన నామినేషన్ వేయనున్నారు. గత డిసెంబర్ లో నోముల ఆకస్మిక మరణంతో సాగర్ కు ఉపఎన్నిక జరుగుతోంది. మరోపక్క, కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ నేత జనారెడ్డి బరిలోకి దిగారు. బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. అభ్యర్థులు నామినేషన్లను వేయడానికి ఈ నెల 30 వరకు గడువు ఉంది. 31న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 3 వరకు గడువు ఉంది. ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుండగా… మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. సాగర్ లో గెలుపును అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.