బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల జాబితా విడుదల

అక్టోబర్ 2020-సెప్టెంబర్ 2021 కాలానికి గానూ బీసీసీఐ గురువారం నాడు వార్షిక కాంట్రాక్టుల జాబితాను విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 28 మంది టీమిండియా ఆటగాళ్లు నాలుగు విభాగాల్లో చోటు దక్కించుకున్నారు. 2019 ప్రపంచకప్‌లో జట్టులో కీలకపాత్ర వహించిన చాహల్, కుల్‌దీప్‌లు తాజా కాంట్రాక్టుల్లో గ్రేడ్-ఎ నుంచి గ్రేడ్-సి విభాగానికి పడిపోయారు.

‘ఏ ప్లస్’ గ్రేడులో కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.7 కోట్ల చొప్పున చెల్లిస్తారు.

ఇక ‘ఏ’ గ్రేడులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా ఉన్నారు. వీరికి సంవత్సరానికి రూ.5 కోట్లు చెల్లిస్తారు.

‘బి’ గ్రేడులో వృద్ధిమాన్ సాహా, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్ ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరికి రూ.3 కోట్ల మేర వార్షిక పారితోషికం ఉంటుంది.

చివరగా ‘సి’ గ్రేడులో కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, దీపక్ చహర్, శుభ్ మాన్ గిల్, హనుమ విహారి, అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చహల్, మహ్మద్ సిరాజ్ ఉన్నారు. వీరు ఏడాదికి రూ.1 కోటి చొప్పున అందుకుంటారు.