నా పేరుపై నకిలీ మందు: ఆనందయ్య

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలన్న ఉద్దేశంతో మందు తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నానని.. కొందరు మాత్రం తన పేరుపై నకిలీ మందు తయారు చేసి అమ్ముకుంటున్నారని ఆనందయ్య అన్నారు. చిట్టమూరు మండలం మల్లాంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పలువురికి కరోనా నివారణ మందు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలకూ తన మందు చేరిందని, ఇందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన పేరుపై తయారు చేస్తున్న నకిలీ మందు వికటిస్తే తాను బాధ్యుడ్ని కానని స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆలయ కమిటీ ఛైర్మన్‌ కోదండరామిరెడ్డి, సాయిరెడ్డి, పార్ధసారథిరెడ్డి, ప్రధాన అర్చకుడు భానుప్రకాష్‌శర్మ తదితరులున్నారు.