జాబ్ క్యాలెండర్లో పోస్టుల పెంపు.. వచ్చే నెలలో ఎపిపిఎస్సి నోటిఫికేషన్..!
అమరావతి: జాబ్ క్యాలెండర్లో ఎపిపిఎస్సి పలు విభాగాల్లో ఇప్పటికే ప్రకటించిన పోస్టుల సంఖ్య పెంచి, ఎపిపిఎస్సి నోటిఫికేషన్ను వచ్చే నెలలో విడుదల చేస్తామని ఎపిపిఎస్సి సభ్యులు షేక్ సలాంబాబు తెలిపారు. ఇప్పటి వరకు 1,180 ఖాళీ పోస్టులను గుర్తించామని, వీటిలో గ్రూప్-1, 2 సహా పలు విభాగాల్లో పోస్టులు ఉన్నట్టు తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు రావాల్సి ఉందని, అవన్నీ వచ్చాక ఎన్ని పోస్టులు వస్తే అన్ని పెంచి ఆగస్టులో గ్రూప్సు సహా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అభ్యర్థుల వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కోరుతున్నారని, ఇప్పటి వరకు వచ్చిన వినతులను పరిశీలించాలని ప్రభుత్వానికి నోట్ పంపినట్టు తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వయోపరిమితి పెంపుపై నిర్ణయం తీసకుంటామని వెల్లడించారు. గ్రూప్-1 మినహాయించి మిగిలిన ఏ నోటిఫికేషన్కూ ఇకపై ప్రిలిమ్స్ ఉండదని స్పష్టం చేశారు. ఇకపై ఎపిపిఎస్సి నియామకాలకు ఒకే పరీక్ష నిర్వహించి, ఇకపై 3 నుంచి 4 నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ఇకపై వచ్చే నోటిఫికేషన్లకు ఇడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు.