ప్రాణాలను బలిచ్చిన మరో రైతు

కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా.. యూపీ-ఘాజీపూర్ బోర్డర్ లో శనివారం మరో రైతు తన ప్రాణాలను బలిచ్చారు. ఢిల్లీ- ఘజియాబాద్‌ సరిహద్దులోని ఆందోళన ప్రాంతంలో యుపికి చెందిన 75 ఏళ్ల రైతు కాశ్మీర్‌ సింగ్‌ లాధి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ”ఈ చలిలో ఇంకా ఎంతకాలం మనం ఆందోళన చేయాలి. ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. నేను నా ప్రాణాలను బలి ఇవ్వడం వల్లనైనా పరిష్కారం దొరుకుతుందేమో” అని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. తన అంత్యక్రియలు కూడా నిరసన ప్రాంతంలోనే నిర్వహించాలని నోట్‌లో పేర్కొన్నారు. కాగా, లాధి మృతదేహం టాయిలెట్‌ల ప్రాంతంలో లభించిందని, తన మృతికి కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అంటూ సూసైడ్‌ లేఖలో ఉందని భారతీయ కిసాన్‌ యూనియన్‌ పేర్కొంది. సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపింది. కాగా, లాధి మనవడు కూడా ఈ ఆందోళనలో పాల్గంటున్నారు. ఆ రైతు అంత్యక్రియలు ఈ ప్రాంతంలోనే జరపాలని కోరుకుంటూ ఆత్మహత్య చేసుకున్నారని, ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ లభ్యమైందని పోలీసులు తెలిపారు. నూతన వ్యవసాయచట్టాలపై కేంద్రంతో జరిపిన చర్చలు ఫలవంతం కాకపోవడంతో.. నిరాశకు గురై ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. కాగా, ఎముకలు కొరికే చలితో ఇప్పటికే పలువురు రైతులు మరణించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *