పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేసిన ఏపీ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. కరోనా వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ అడ్డొస్తుందని హైకోర్టు భావించింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎస్‌ఈసీ విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ప్రభుత్వం వాదనలతో హైకోర్టు పూర్తిగా ఏకీభవించింది.

‘ప్రజారోగ్యం దృష్ట్యా షెడ్యూల్‌ను రద్దు చేస్తున్నాం. ఆర్టికల్‌ 14, ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించే హక్కు కాపాడాల్సిందే. ప్రజలకు ఉన్న హక్కులను కాలరాయలేం. ప్రభుత్వ సూచనలను ఎస్‌ఈసీ పట్టించుకోలేదని’ హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్‌ఈసీ షెడ్యూల్‌ విడుదల చేయడంతో ఎస్‌ఈసీ నిర్ణయంపై ఏపీ సర్కార్‌ హైకోర్టును ఆశ్రయించింది.