జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు పకడ్బందీ ఏర్పాట్లు

* సభా స్థలి పరిశీలించిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
మచిలీపట్నం వేదికగా మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ప్రధాన వేదిక, డీ జోన్, వీర మహిళలు, మీడియా కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీలు పరిశీలించారు. సభకు హాజరయ్యే ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా చూడాలని నాయకులకి సూచించారు. పనులు ఎంత వరకు వచ్చాయనే విషయం పరిశీలించి, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్ కు పలు సూచనలు చేశారు. పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని, సభకు తరలివచ్చే ఆశేష జనవాహినికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు ఉండాలని సూచించారు.
* జనసేన పార్టీలోకి చేరికలు
మచిలీపట్నంలో జరగనున్న 10వ ఆవిర్భావ సభా ప్రాంగణం వద్ద పెడన, తిరువూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు జనసేన పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అందరికీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తిరువూరు మాజీ ఎంపీపీ, టీడీపీ నాయకులు శ్రీ పసుపులేటి సురేష్, శ్రీ లింగినేని సుధాకర్, మైనారిటీ నాయకులు శ్రీ షేక్ ఫరీద్, శ్రీ కొలగాని అఖిల్, శ్రీ రామిశెట్టి జగన్, శ్రీ కస్తూరి ఓంకార్, శ్రీ గొడ్డేటి కరిముల్లా, పెడన నియోజకవర్గం చిట్టి గూడూరు మాజీ సర్పంచ్ శ్రీ వేము ఆంజనేయులు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి శ్రీ మనుబోలు శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో వీరంతా జనసేనలోకి చేరారు.