టీకా పంపిణీలో ప్రపంచ స్థాయిలో రికార్డు భారత్ దే

కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ ప్రపంచ రికార్డు సాధించినట్లు కేంద్రం ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో తొలిరోజే దేశవ్యాప్తంగా 2,07,229 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని, రెండో రోజు 17 వేల మందికి వ్యాక్సిన్‌ అందించామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.. ఇప్పటి వరకు 2,24,301 మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. టీకా తీసుకున్న వారిలో 447 మందికి దుష్ర్పభావాలు కనిపించాయని.. వారిలో ముగ్గురికి మాత్రం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిచాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపింది.

భారత్ రికార్డు…

వ్యాక్సిన్ కార్యక్రమంలో భారత్‌ రికార్డు స్థాయిలో టీకాలను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. టీకా పంపిణీ ప్రారంభమైన రోజే రెండు లక్షల మందికి అందించడం ద్వారా ఈ ఘనత సాధించామని, ప్రపంచ దేశాలైన అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ దేశాల్లో అందించిన వ్యాక్సిన్ల సంఖ్య కంటే ఇది ఎక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహన్ అగ్నాని వెల్లడించారు.

ఆరు రాష్ట్రాల్లో…

దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో 553 కేంద్రాల్లో మాత్రమే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదనపు కార్యదర్శి మనోహర్‌ వెల్లడించారు. రెండో రోజు మొత్తం 17,072 మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, మణిపూర్‌, తమిళనాడు రాష్ట్రాల్లో ఆదివారం నాడు టీకా పంపిణీ కొనసాగిందని తెలిపారు.