గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ ఎంపిక

గుజరాత్ నూతన సీఎంగా భూపేంద్ర పటేల్ ఎంపికయ్యారు. సీఎం పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేయడంతో కొత్త సీఎం ఎంపిక కోసం నేడు బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. ఘట్లోడియా నియోజకవర్గం ఎమ్మెల్యే భూపేంద్ర పటేల్ ను కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు.

ఈ సమావేశంలో బీజేపీ హైకమాండ్ పరిశీలకులుగా కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషి హాజరయ్యారు. భూపేంద్ర పటేల్ ను బీజేపీ శాసనసభాపక్షం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేల అభీష్టాన్ని గౌరవిస్తున్నట్టు పరిశీలకుల హోదాలో హాజరైన తోమర్, జోషి పేర్కొన్నారు. ఈ సమావేశానికి విజయ్ రూపానీ, కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా హాజరయ్యారు.