తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

నేడు దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. క్రైస్తవులే కాక హిందువులు కూడా ఈ పండుగని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకుంటున్నారు. కరుణామయుడు, లోకరక్షకుడు ఏసుక్రీస్తు జననం సందర్భంగా క్రిస్మస్‌ సందడి నెలకొంది. చర్చిలను విద్యుత్‌ కాంతులతో అత్యంత సుందరంగా అలంకరించారు. క్రిస్మస్‌ పండుగకు ముందు రోజైన గురువారం అర్థరాత్రి నుంచే ఆధ్యాత్మికత వైభవం వెల్లివిరిసింది.

క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా మెదక్‌ పట్టణంలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్‌ఐ చర్చి ముస్తాబైంది. గురువారం రాత్రి విద్యుత్‌ దీప కాంతుల్లో మెరిసిపోయింది. చర్చి ప్రాంగణంలో శాంతాక్లాజ్, క్రిస్మస్‌ ట్రీలను ఏర్పాటు చేశారు. శుక్రవారం తెల్లవారు జామున జరిగే మొదటి ఆరాధనను బిషప్‌ సాల్మాన్‌రాజ్‌ ప్రారంభించనున్నారు.

రెండో ఆరాధన ఉదయం 9గంటలకు ప్రారంభమవుతుంది. పోలీసుల నిఘా కోసం ప్రత్యేకంగా ఔట్‌పోస్టు ఏర్పాటు చేసి అక్కడే బస చేస్తున్నారు. బందోబస్తును ఎస్పీ చందనాదీప్తి పర్యవేక్షిస్తున్నారు. ఆసియా ఖండంలో అతి పెద్ద మెదక్ చర్చిలో యేసు పుట్టిన రోజు వేడుకలు అర్ధరాత్రి నుంచి మొదలయ్యాయి. చర్చి పాస్టర్ సాల్ మాన్ రాజు ఆరాధన యేసు సందేశాలు అందిస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్ నేపథ్యంలో అందరూ జాగ్రత్తలు పాటిస్తూ సెలబ్రేషన్స్ చేసుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి.