కల్నల్ సంతోష్‌బాబు చౌరస్తా: మంత్రి కేటీఆర్ నామకరణం

కర్నల్ సంతోష్‌బాబు త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరవదని మంత్రి కేటీఆర్ అన్నారు. సంతోష్‌బాబు అమరుడై అప్పుడే ఏడాది గడిచిదంటే నమ్మలేకపోతున్నామన్నారు. భారత్‌-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతావని కోసం వీరోచితంగా పోరాడి అమరుడైన కర్నల్‌ సంతోష్‌ బాబు తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం సూర్యాపేటలో కోర్టు చౌరస్తాలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోర్టు చౌరస్తాకు కల్నల్ సంతోష్‌బాబు చౌరస్తాగా మంత్రి నామకరణం చేశారు. అనంతరం జరిగిన విగ్రహావిష్కరణ సభలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఎంతకాలం జీవించామన్నది కాదు.. ప్రజలు గుర్తుంచుకునేలా జీవించాలన్నారు. సీఎం కేసీఆర్ కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి ఇచ్చిన గౌరవం, సముచిత స్థానం భారత సైన్యం మొత్తానికి ధైర్యాన్నిచ్చిందన్నారు. సంతోష్‌బాబు కుటుంబానికి సీఎం పెద్దఎత్తున సాయం చేశారనే ఆరోపణలు వచ్చాయని, కానీ సైన్యంలో ప్రతి కుటుంబానికి అండగా నిలిచేలా సీఎం నిర్ణయం ఉందని చెప్పారు. సూర్యాపేట ప్రజలకు స్ఫూర్తినిచ్చేలా సంతోష్‌బాబు విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామన్నారు. ప్రతీ ఒక్కరిలో స్ఫూర్తి నింపేలా సంతోష్‌బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అత్యత్భుతం అని తెలిపారు.