కొవిషీల్డ్‌ మూడో డోసుతో అధిక స్థాయిలో యాంటీబాడీలు

కొవిషీల్డ్‌ మూడోడోసుతో యాంటీబాడీల స్థాయిలు అధికంగా వృద్ధి చెందుతున్నాయని ఆక్స్‌ఫర్డ్‌ నివేదిక తెలిపింది. 18-55 ఏళ్ల మధ్య వయసున్న వాలంటీర్లపై బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ప్రస్తుతం కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసుల మధ్య విరామాన్ని 12-16 వారాలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే రెండు డోసుల మధ్య 45 వారాల (సుమారు 11 నెలలు) విరామం ఉంటే.. వ్యక్తుల్లో రోగ నిరోధకత స్పందన మరింత మెరుగ్గా ఉన్నట్లు తేల్చింది. కొవిషీల్డ్‌ మూడోడోసు కూడా తీసుకుంటే యాంటీబాడీల స్థాయులు ఇంకా అధికంగా వఅద్ధి చెందుతున్నాయని నిర్ధారించింది. కొవిషీల్డ్‌ తొలి డోసును తీసుకున్నాక సుమారు ఏడాది పాటు యాంటీబాడీల స్థాయులు అధికంగా ఉంటున్నాయని నిపుణులు తేల్చారు. 12 వారాల విరామంతో రెండు డోసులను తీసుకున్నవారితో పోలిస్తే.. 11 నెలల వ్యవధితో రెండో డోసు తీసుకున్నవారిలో యాంటీబాడీ స్థాయులు నాలుగు రెట్లు అధికంగా ఉంటున్నాయి. రెండో డోసు తీసుకున్న ఆరు నెలల అనంతరం మూడో డోసును తీసుకుంటే యాంటీబాడీ స్థాయులు ఆరు రెట్లు అధికమవుతున్నాయి. రోగ నిరోధక వ్యవస్థలో కీలకమైన టి కణాలు కూడా మెరుగ్గా ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. ఆల్ఫా, బీటా, డెల్టా వేరియంట్లను అడ్డుకోవడంలో మూడో డోసు మరింత క్రియాశీలకంగా పనిచేస్తోంది.