సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అరెస్ట్
రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది మృతిచెందడంపై తిరుపతిలోని ఆస్పత్రి వద్ద సీపీఐ ఆందోళన చేపట్టింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలని నేతలు డిమాండ్ చేశారు. అంతకుముందు సీపీఐ శ్రేణులు ర్యాలీగా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణను పొలీసులు అరెస్ట్ చేశారు. నగరి సమీపంలో ఆయనను అరెస్టు చేసిన పోలీసులు.. స్వగ్రామం ఐనంబాకం తరలించారు.
మరోవైపు నారాయణ అరెస్ట్ను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. ” తిరుపతి వెళ్తుంటే అరెస్టు చేస్తారా?. ఆక్సిజన్ లోపంతో జరిగిన మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే. ఎన్ని మరణాలు సంభవించాయో రాష్ట్ర ప్రభుత్వం వివరాలు చెప్పాలి” అని రామకృష్ణ డిమాండ్ చేశారు.
రుయా ఆస్పత్రి సందర్శనకు వెళ్లిన తెదేపా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, దేవనారాయణరెడ్డిఅను అరెస్టు చేసిన పోలీసులు అలిపిరి తరలించారు.