హైకోర్టు జడ్జిల పోస్టులపై నిర్ణయం తీసుకోండి: కేంద్రాన్ని కోరిన సీజేఐ ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దేశంలో ఖాళీగా ఉన్న హైకోర్టు జడ్జి పోస్టుల భర్తీ అంశాన్ని తన లేఖలో ప్రస్తావించారు. కొలీజియం సిఫారసులను పరిశీలించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని లేఖలో కోరారు. న్యాయ వ్యవస్థలతో సంబంధం ఉన్నవారిని కూడా కరోనా వారియర్స్ గా గుర్తించాలని సీజేఐ ఎన్వీ రమణ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కోర్టు సిబ్బంది కుటుంబ సభ్యులకు కూడా కరోనా వ్యాక్సిన్లు అందించాలని కోరారు.

కాగా, జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ ‘అనామలీస్ ఇన్ లా అండ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్ రచించారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ, తాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో మాజీ న్యాయమూర్తి రవీంద్రన్ తనకో లేఖ రాశారని, ఆ లేఖ తనకు మార్గదర్శిగా నిలిచిందని అన్నారు. జస్టిస్ రవీంద్రన్ మాటలు తనకు ఎంతో స్ఫూర్తి కలిగించాయని పేర్కొన్నారు. అంతేకాదు, ఎన్వీ రమణ ఆ లేఖను చదివి వినపించారు.