రష్యా పర్యటనకు బయలుదేరిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ బుధవారం భారతీయ వాయుసేనకు చెందిన విమానంలో రష్యాకు పయనమయ్యారు. ఆ దేశంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. మాస్కోలో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రష్యా, చైనా రక్షణ మంత్రులతో రాజ్‌నాథ్‌ కీలక చర్చలు జరుపుతారని తెలుస్తోది. ఈ నేపథ్యంలో లడఖ్ సరిహద్దులో భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గవచ్చని సమాచారం. ఐరోపా, ఆసియా దేశాల రాజకీయ, ఆర్థిక, భద్రత కూటమి అయిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్పీఓ)ని 2001 జూన్ 15న చైనాలోని షాంఘైలో ప్రకటించారు. చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజ్కిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్ వ్యవస్థాపక సభ్య దేశాలుగా 2003 సెప్టెంబర్ 19న ఈ సంస్థ ఉనికిలోకి వచ్చింది. 2017 జూన్ 9న భారత్, పాకిస్థాన్ కూడా సభ్య దేశాలుగా చేరాయి. దీంతో ఈ కూటమి సభ్య దేశాల సంఖ్య ఎనిమిదికి పెరిగింది.