హోం ఐసోలేషన్‌లో రెమ్‌డెసివర్‌ ను వాడొద్దు

కరోనా చికిత్స కోసం వినియోగించే ఔషధాల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రెమ్‌డెసివర్‌ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు రెమ్‌డెసివర్‌ తీసుకోవద్దని ఎయిమ్స్‌ వైద్యులు సూచిస్తున్నారు. కొవిడ్‌ పేషెంట్ల కోసం ‘మెడికేషన్‌ అండ్‌ కేర్‌ ఇన్‌ హోం ఐసోలేషన్‌’ అనే వెబినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులు అనేక సలహాలిచ్చారు. ‘హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ రెమ్‌డెసివర్‌ తీసుకొవద్దు. సానుకూల దృక్పథం, వ్యాయాయం అవసరం’ అని డాక్టర్‌ నీరజ్‌ నిష్కల్‌ తెలిపారు. 80శాతం కరోనా బాధితులు చాలా స్వల్ప లక్షణాలతో మాత్రమే బాధపడుతున్నారని, మొదటిసారి ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ రిపోర్ట్‌ వస్తే మరోసారి పరీక్ష చేయించుకోవాలని సూచించారు. సరైన సమయంలో సరైన మోతాదులో మందులు వేసుకోవాలని తెలిపారు.

ఇక 94శాతం కన్నా తక్కువ ఆక్సిజన్‌ స్థాయులు నమోదవడం, ఇతర తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రమే ఆస్పత్రిలో చేరాలని డాక్టర్‌ మనీశ్‌ పేర్కొన్నారు. కరోనా బారిన పడిన వారిలో సాధారణంగా జ్వరం, పొడి దగ్గు, అలసట, వాసన, రుచి కోల్పోవడం, గొంతులో గరగర, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, డయేరియా, శరీరంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటున్నాయి. ఇలాంటి లక్షణాలతో బాధపడేవారు వెంటనే ఐసోలేషన్‌లో ఉండటం మంచిదని నీరజ్‌ అభిప్రాయపడ్డారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ప్రతి ఒక్కరూ మూడు లేయర్లు కలిగిన మాస్క్‌ను ధరించడంతో పాటు, ప్రతి 8గంటలకు కొత్తది లేదా శుభ్రపరిచిన మాస్క్‌ ధరించాలని సూచించారు. కరోనా బాధితుడికి సహాయం చేసే వ్యక్తి తప్పనిసరిగా ఎన్‌-95 మాస్క్‌ ధరించాలని తెలిపారు. పల్స్‌ ఆక్సీమీటర్‌ దగ్గర పెట్టుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ స్థాయిలను పరీక్షించుకుని వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవచ్చని పేర్కొన్నారు.