Drone Attack: ఇరాక్‌ ప్రధాని నివాసంపై దాడి

ఇరాక్ ప్రధాని ముస్తాఫా అల్-కదిమి నివాసంపై ఈ తెల్లవారుజామున బాంబు దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో నిండిన ఓ డ్రోన్‌తో బాగ్దాద్‌లోని ఆయన నివాసంపై దాడి జరిగినట్టు భద్రతా దళాలు తెలిపాయి. ఈ దాడి నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఆయన రక్షణ సిబ్బంది పలువురు గాయపడ్డారు. గత నెలలో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో హింస చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో తాజా దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రధాని నివాసంపై డ్రోన్ దాడి ఘటనకు ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత ప్రకటించలేదు. డ్రోన్ దాడి జరిగిన ప్రాంతం గ్రీన్ జోన్. ఇక్కడ పలు ప్రభుత్వ భవనాలు, విదేశీ దౌత్య కార్యాలయాలు ఉంటాయి. ప్రధాని నివాసంపై దాడి ‘ఆరోగ్యకరం’ కాదని  ఇరాక్ మిలటరీ పేర్కొంది. అంతకుమించి వివరాలు వెల్లడించలేదు. ప్రధాని సురక్షితంగా ఉన్నారని, అందరూ సంయమనం పాటించాలని ప్రధాని ట్విట్టర్ ఖాతా పేర్కొంది.